అధివాస్తవ విస్మృతి
ఈ నిరామయ సాయంత్రాన
ఎవరిని గుర్తుకు తెచ్చుకొని
రోదించను?
ఎత్తైన ఈ రెండు పర్వతాల మద్య
లోయలో
గుబురుగా ఎదిగిన పొదలతో
నా ఒంటరి సమాధి కప్పివేయబడివుంది
మెల్లగా, భ్రమలాగా
మేఘాలు భూమిని రాసుకొని వెళుతున్నాయి
ఒక్క జ్ఞాపకమూ గుర్తులేదు
కన్నీరు కార్చేందుకు ఒక్క జ్ఞాపకమూ
గుర్తులేదు
ఈ రోజెవరో నా అజ్ఞాత సమాధి మీద
రెండు పుష్పాలు ఉంచారు
రెండు కన్నీటి బొట్లూ రాల్చారు
ఆమె ఎవరో గుర్తులేదు
ఒక్క జ్ఞాపకమూ గుర్తులేదు
కన్నీరు కార్చేందుకు ఒక్క జ్ఞాపకమూ
గుర్తు లేదు
కవిత మరియు డిజిటల్ ఆర్ట్ : శ్రీరామ్
(సారంగ సాహిత్య పత్రికలో ప్రచురితం)
No comments:
Post a Comment